top of page

పతనాన్ని శాసిస్తున్న ఆన్‌లైన్‌ జూదం

  • Writer: DV RAMANA
    DV RAMANA
  • Apr 1
  • 2 min read

మహాభారతంలో కురుక్షేత్ర యుద్ధం ఎందుకు జరిగిందంటే జూదమే కారణమని చెప్పకతప్పదు. కురు పాండవ అగ్రజుల మధ్య జరిగిన జూదంలో పాండవులు రాజ్యాన్ని, చివరికి భార్యను కూడా కోల్పోతారు. అరణ్య, అజ్థాతవాసాలు చేస్తారు. అయినా తిరిగి తమ రాజ్యాన్ని పొందేందుకు కురుక్షేత్ర యుద్ధం చేయక తప్పలేదు. అది భారత కథ. రాజుల నాటి కథ. రాజులు జూదం ఆడటం ఆ కాలంలో రివాజే. అయితే అప్పుడు, ఇప్పుడు, ఎప్పుడయినా.. జూదం ఆశతో మొదలై అత్యాశతో కూడుకుని దురాశగా పరిణామం చెందుతుంది. చివరాఖరికి అందరినీ ముంచుతుంది. జూదమూ ఓ రకమైన పందెమే! బానిస సమాజం లోనైతే పందెం కాసి, ఇద్దరు బానిసలను బల ప్రయోగానికి, చంపుకోవడానికి పురికొల్పేవారు. ఇప్పటి కోడి పందేలలాంటిదన్నమాట. ఇదో భూస్వామిక విధానపు క్రూరవినోదం. ప్రజలు దీనికి సమిధలు, ప్రజాధనం దీనికి సమర్పణం. కట్‌ చేస్తే.. ఆధునిక వ్యాపార సమాజంలో లాభాల ఆశల ఎరకు చిక్కి జూద క్రీడకు బలైపోతున్న సామాన్య ప్రజల దీనగాథలు కోకొల్లలు. ఈ దోపిడీ వ్యవస్థలో కునారిల్లిపోతున్న, దారిద్య్రం ముంచెత్తుతున్న సామాన్య ప్రజల ఆశలను, ఆవేశాలను వినియోగించుకుని మరింత దోపిడీకి పాల్పడుతున్న పాచికలే ఈ పందెం, బెట్టింగ్‌, మల్టీ లెవల్‌ మార్కెటింగ్‌ మొదలైన సాధనాలు. ప్రపంచీ కరణ, రియల్‌ ఎస్టేట్‌ బూమ్‌లు సమాజానికి ఈజీ మనీని పరిచయం చేశాయి. ఆ ఆశల వలలో పడి ఎంతోమంది తమ జీవితాలను, కుటుంబాలను ధ్వంసం చేసుకుంటున్నారు. ప్రస్తుత డిజిటల్‌ యుగంలో బెట్టింగ్‌ యాప్‌ల రూపంలో సైబర్‌ దోపిడీకి తెరలేపారు నయా జూదగాళ్లు. లక్షల కోట్ల రూపాయలను సామాన్యుల నుంచి కొల్లగొట్టే సంస్థలు వేలాదిగా పుట్టుకొచ్చాయి. మన రాష్ట్రంలోనే వందలమంది ప్రాణాలను ఈ యాప్‌లు బలి తీసుకున్నాయి. భర్తలకు తెలియకుండా భార్యలు, భార్యలకు తెలియకుండా భర్తలు బెట్టింగులకు బానిసలై కుటుంబాలను బలిపెట్టుకున్నారు. ఇబ్బడిముబ్బడిగా డబ్బులు వస్తాయని కథలు చెబుతూ, భ్రమల్లో ముంచెత్తుతూ పాతాళానికి నెట్టేస్తున్నారు. మొదట చిన్నచిన్నగా లాభాల ఎర చూపిస్తారు. ఆ తర్వాత పెద్ద మొత్తాల్లో బెట్టింగులకు పూనుకోగానే ముంచి ఊరుకుంటారు. యాప్‌లే కాదు, సోషల్‌ మీడియాలో స్పాన్సర్స్‌ ప్రకటనలు కూడా విపరీతంగా ప్రసారం అవుతున్నాయి. రాష్ట్రపతి ముర్ము, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌, ఇన్ఫోసిస్‌ నారాయణమూర్తి, సుధామూర్తి, ముఖేష్‌ అంబానీ లాంటి ప్రముఖులు చెబుతున్నట్టుగానే ఫేక్‌ వీడియోలు వదులుతున్నారు. రూ.21వేలు ఇన్వెస్ట్‌ చేస్తే నెల, రెండు నెలల్లోనే రూ.15 లక్షల వరకు సంపాదించవచ్చన్నది ఆ వీడియోల సారాంశం. ‘డబ్బులెవరికీ ఊరకనే రావు’ అన్న ప్రకటనను తప్పక గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. వీటిని అరికట్టడం ఎలాగో ప్రభుత్వం ఆలోచించాలి. ఈ బెట్టింగ్‌ యాప్‌ల ప్రమోషన్లలో దేశంలోని ప్రముఖులతో పాటు సినీతారలు, ఆటగాళ్లూ పాల్గొంటున్నారు. భారతరత్న సచిన్‌ టెండూల్కర్‌, షారుక్‌ఖాన్‌, కోహ్లీలపైనా బెట్టింగ్‌ యాప్‌లకు ప్రమోషన్‌ చేశారని ఫిర్యాదులు నమోదయ్యాయి. మన తెలుగు సినీతారలు బాలకృష్ణ, ప్రభాస్‌, గోపీచంద్‌, రానా, ప్రకాష్‌రాజ్‌, విజయ్‌ దేవరకొండ, మంచు లక్ష్మి, శ్యామల, విష్ణుప్రియ ఇలా ఎన్నో పేర్లు బయటకి వచ్చాయి. ఫన్‌-88 యాప్‌ ద్వారా కోట్లాది రూపాయలు తరలించుకుపోయారని ఆరోపణలొచ్చాయి. ఈ మధ్య హైదరాబాద్‌ సైబర్‌క్రైం పోలీసులు బెట్టింగ్‌ యాప్‌ల నిర్వహకులపై దాడులు చేసి సుమీరు 385 కేసులు నమోదు చేశారు. వాటి ప్రమోటర్లను ప్రశ్నిస్తున్నారు. అంతెందుకు మన మెట్రోరైల్లోనే ఈ బెట్టింగ్‌ యాడ్స్‌ పెద్ద ఎత్తున దర్శనమిస్తున్నాయి. తొలగిస్తామని అధికారులు చెబుతున్నారు. 2017లో ప్రమోషన్‌ యాడ్‌లో పాల్గొన్నానని, తర్వాత అది మోసమని తెలిసి రద్దు చేసుకున్నానని ప్రకాష్‌రాజ్‌ ప్రకటించారు. కానీ మిగతా సెలబ్రిటీలెవరూ స్పందించలేదు. కొందరు మాత్రం తెలియక చేశామంటున్నారు. బెట్టింగ్‌ యాప్‌లపై కఠినంగా వ్యవహరిస్తామని, ప్రచారం కల్పించేవారినీ విచారిస్తామని ప్రభుత్వం అసెంబ్లీలో వెల్లడిరచింది. ఐపీఎల్‌ పోటీలపైనా బెట్టింగ్‌లు జోరుగా జరుగుతున్నాయి. బెట్టింగుల్లో లక్షలు కోల్పోయిన ఓ యువకుడు నిన్నగాక మొన్న ఆత్మహత్య చేసుకున్నాడు. తక్కువ సమయంలోనే భారీ లాభాలిస్తామని డెయిరీఫామ్‌ నిర్వహిస్తున్నామని ఊదరగొట్టిన ఓ ఫేక్‌ సంస్థ రూ.20కోట్లతో బిచాణా ఎత్తేసింది. ఈ ఆర్థిక నేరగాళ్ల సైబర్‌ ఆగడాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. డబ్బుపై ప్రజలకున్న ఆశను ఆసరా చేసుకుని ఇలాంటి మోసాలకు పాల్పడటం ఈ మధ్యకాలంలో బాగా పెరిగింది. సామాజికి బాధ్యత మరిచిన పలు వురు తారలు, ప్రముఖుల ప్రచారం తోడవుతోంది.

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page