బలూచ్ వెనుక సీఐఏ!
- DV RAMANA
- Mar 15
- 2 min read

సీఐఏతో సహవాసం అంటే వాడుకొని వదిలెయ్యడమే. పాకిస్తాన్ గూఢచార సంస్థ ఐఎస్ఐ 20 ఏళ్లు సీఐఏతో కలిసి పనిచేసింది. ఎంతలా అంటే పాకిస్తాన్లో ఒకే ఆఫీసులో సీఐఏ, ఐఎస్ఐలు కలిసి పనిచేశాయి. ఆఫ్ఘనిస్తాన్లో సోవియట్ సైన్యానికి వ్యతిరేకంగా ముజాహిదిన్లకు శిక్షణ ఇచ్చే నెపంతో సీఐఏ, ఐఎస్ఐలు చేతులు కలిపాయి. లక్ష్యం నెరవేరాక సీఐఏ సామాను సర్దుకొని చెప్పాపెట్టకుండా ఖాళీ చేసి వెళ్లిపోయింది. డబ్బులు ఇచ్చాం.. పని చేయించుకున్నాం అనేదే సీఐఏ పాలసీ. బలూచిస్తాన్లోని క్వెట్టా నుంచి పెషావర్ వెళుతున్న జాఫర్ ఎక్స్ప్రెస్ను హైజాక్ చేసిన బీఎల్ఏ తమ వద్ద ఇంకా వంద మంది బందీలుగా ఉన్నారని చెప్తుంటే.. పాకిస్తాన్ ప్రభుత్వం మాత్రం రైలు హైజాక్ ఉదంతం సుఖాంతమైందని, బందీలందర్నీ విడిపించామని చెబు తోంది. ఇక్కడ బీఎల్ఏ, ఐఎస్ఐలు చెప్పని విషయం ఒకటి ఉంది. హైజాక్ అయిన రైలులో 184 మంది ఐఎస్ఐ, యాంటి టెర్రరిస్ట్ స్క్వాడ్తోపాటు పాక్ సైనికాధికారులు ఉన్నారు. వీరే బీఎల్ఏ లక్ష్యం. అందుకనే వారిని మాత్రమే బందీలుగా పెట్టుకుని వృద్ధులు, మహిళలు, చిన్న పిల్లలు తదితర ప్రయాణికులను వదిలిపెట్టింది. వారినే క్వెట్టాకు తరలించిన పాక్ సైన్యం తమ ఆపరేషన్ సక్సెస్ అయ్యిందని ప్రకటించి చేతులు దులుపుకుంది. బీఎల్ఏ మాత్రం తమ వద్ద 100 మంది బందీలుగా ఉన్నారని ప్రకటించింది. జైళ్లలో ఉన్న తమ నాయకులను విడుదల చేయాలని, ఆచూకీ లేకుండా పోయిన బలూచ్ పౌరులను కూడా విడుదల చేస్తేనే బందీలను విడుదల చేస్తామని బీఎల్ఏ అంటున్నది. పాకిస్తాన్ ప్రభుత్వం మాత్రం 36 గంటల పాటు జరిగిన రెస్క్యూ ఆపరేషన్లో 36 మంది ఉగ్రవాదులను హతమార్చి బందీలను విడిపించామని ప్రకటించింది. మరోవైపు జాఫర్ ఎక్స్ప్రెస్ హైజాక్ వెనుక భారత నిఘా సంస్థ ‘రా’ హస్తం ఉందని షరా మామూలుగా పాక్ ఆరోపించింది. బ్రిటీష్ వారు భారత్ను విభజించి పాకిస్తాన్ ఏర్పాటు చేసినపుడు బలూచిస్తాన్ అందులో లేదు. పాక్ సైన్యం దాన్ని ఆక్రమించి తనలో కలుపుకుంది. కాశ్మీర్ను కూడా కలుపుకోవాలని ఆశపడి భంగపడిరది. ఇప్పుడు పీవోకే ప్రజలు భారత్లో కలవ డానికి సిద్ధంగా ఉన్నారు. పీవోకే ప్రజల నుంచి బలమైన ఒత్తిడి వచ్చే వరకూ భారత్ వేచి ఉం టుందే తప్ప తనకు తానుగా ప్రత్యక్ష చర్యకు దిగదు. ఉక్రెయిన్లో భాగమైన క్రిమియాను ఫ్లెబి సైట్ (ప్రజాభిప్రాయ సేకరణ) తర్వాతే పుతిన్ రష్యాలో కలిపేశారు. పీవోకే విషయంలోనూ భారత్ అదే చేస్తుంది. 36 గంటలపాటు ఆపరేషన్ నిర్వహించినా రైలులో ఉన్న తమ సైన్యాధికారులను పాక్ విడిపించుకోలేకపోయిందంటే దాని పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. అసలు పాకిస్థాన్లో మొబైల్ నెట్వర్క్ పూర్తిగా లేదు. దీనివల్ల తమ ఇరుగుపొరుగు దేశాల్లో ఏం జరుగుతున్నదో, ఆ దేశాల ప్రజలు, తమ మధ్య ఉన్న తేడా ఏమిటో అక్కడి ప్రజలకు తెలియడంలేదు. అలాగే బ్రిటీష్ ఇండియాలో ఉన్నప్పుడు కట్టిన రైల్వేస్టేషన్లు ఇప్పటికీ అలానే ఉన్నాయి. కనీసం ఎలక్ట్రిఫికేషన్ జరగలేదు. ఒక్క ఆటో ఇండస్ట్రీ లేదు. సుజుకి, హోండాలు తమ అసెంబ్లింగ్ యూనిట్లను మూసి వేసి అయిదేళ్లు అవుతున్నది. ఉల్లిపాయలు కిలో రూ.220, టమోటా కిలో రూ.120. భారత్తో వాణిజ్యంపై నిషేధం విధించుకొని భారత్ నుంచి దుబాయ్ ఎగుమతి అయ్యే సరుకులను అక్కడ కొని తిరిగి పాకిస్తాన్లో అమ్ముతుంటే ధరలు పెరగకుండా ఎలా ఉంటాయి. చివరికి భారత్లో తయారయ్యే సౌందర్య ఉత్పత్తులు కూడా దుబాయ్ నుంచి దిగుమతి చేసుకొని అధిక ధరలకు కొనగోలు చేయాల్సిన దుస్థితి వారిది.1950 నుంచి అమెరికా ఇచ్చే సహాయం మీదనే పాకిస్థాన్ నెట్టుకొచ్చింది. 2018లో ట్రంప్ సహాయం ఆపడంతో పాక్ అసలు స్వరూపం బయటపడిరది. పీవోకే, సింధ్, బలూచిస్తాన్ ప్రావిన్స్లు ఎప్పటికైనా పాకిస్థాన్ నుంచి వేరుపడేవే. తనని తాను పోషించుకోలేని దేశం పక్క దేశాల ప్రాంతాలను కలుపుకోవాలనుకోవడం అత్యాశే. బలూచిస్తాన్ ఇరాన్తో సరిహద్దు కలిగి ఉన్నందున దాన్ని చైనా చేతిలోకి అమెరికా వెళ్లనివ్వదు. సీఐఏ మద్దతు లేనిదే బీఎల్ఏ ఇంత భారీ దాడి చేయలేదు. బీఎల్ఏ ఇక ముందు దాడులు తీవ్రతరం చేస్తే అవి సీఐఏ సహకారంతోనే సాధ్యం. బలూచిస్తాన్ ప్రత్యేక దేశంగా ఏర్పడితే అమెరికాకు లాభం. తన మిలిటరీ బేస్పే పెట్టుకునే అవకాశం ఉంటుంది. అదే సమయంలో బలూచ్తో భారత్కి వచ్చేది లేదు, పోయేది లేదు పాక్ మరింత నష్టపోవడం తప్ప.
コメント