వంటింట్లో గ్యాస్ మంట
- DV RAMANA
- Apr 11
- 2 min read

దేశంలోని కోట్లాది పేద మహిళలకు పొగరహిత వంట సౌకర్యం కల్పించాలన్న ఉద్దేశంతో 2016లో పీఎం ‘ఉజ్వల యోజన’ను ప్రారంభించారు. ‘కట్టెల పొయ్యిలో వండే మా తల్లులు గౌరవంగా జీవించాలన్నదే మా ఉద్దేశం’ అని కూడా చెప్పారు. అందుకే ఉజ్వల పథకాన్ని ప్రవేశపెట్టినట్టు ఆనాడు ప్రధాని మోదీ భావోద్యేగంతో చెప్పిన తీరు ఇప్పటికీ మహిళలకు గుర్తుంది. అ నినాదం ఆయనకూ, ఆయన పార్టీకి రాజకీయంగా ఎంతో లబ్ది చేకూర్చింది. ఇప్పుడు అదే తల్లులపై బండ రూపంలో భారం మోపారు. రోజురోజుకూ పెరుగుతున్న నిత్యావసర ధరలతో ఇప్పటికే సామాన్యజనం పౌష్టికాహారానికి దూరమవుతున్నారు. తాజాగా పెరిగిన గ్యాస్బండ భారంతో పేద, మధ్యతరగతి జనం ఆరోగ్యంగా ఎలా ఉండగలుగుతారన్నది ప్రశ్న. పెరిగిన బండ భారం మంగళవారం నుంచే అమల్లోకి వచ్చింది. పీఎంయూవై లబ్ధిదారులకు, ఇతర వినియోగదారులకు ఇది భారమే. ఈ పెంపు గ్యాస్ వినియోగ దారులకే కాదు సబ్సిడీ కింద సిలిండర్లను అందిస్తున్న పలు రాష్ట్ర ప్రభుత్వాలపైనా భారం పడనుంది. అదేవిధంగా పెట్రోల్, డీజీల్పై రూ.2 చొప్పున ఎక్సైజ్ డ్యూటీని కేంద్రం పెంచింది. అయితే ఈ పెంపు ప్రభావం వినియోగదారులపై పడదని, ఈ భారాన్ని చమురు మార్కెటింగ్ కంపెనీలు భరిస్తాయని కేంద్రం వివరించింది. ఎక్సైజ్ సుంకం పెంపు వల్ల కేంద్రానికి ఆదాయం లభిస్తుంది. 15 రోజులకోసారి పెట్రో ధరలు సమీక్షిస్తూ నిర్ణయం తీసుకునే విధానాన్ని చమురు ఉత్పత్తి సంస్థలు చాలా కాలంగా అమలు చేస్తున్నందున ఎప్పుడైనా ధరలు పెరగడం ఖాయమని తెలుస్తోంది. కొన్నిరోజుల క్రితమే 19 కేజీల కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్పై రూ.41 మేర ధరలను ఆయిల్ మార్కెటింగ్ కంపెనీ (ఓఎంసీ)లు తగ్గించిన విషయం తెలిసిందే. తాజాగా వంటగ్యాస్ సిలిండర్ ధరలను పెంచుతూ మోదీ సర్కారు తీసుకున్న నిర్ణయం సామాన్యులకు ధరాఘాతమే. 2014లో మోదీ అధికారంలోకి వచ్చినపుప్పడు రూ. 399 ఉన్న సిలిండర్ ధర.. ఇప్పుడు రూ.900 పైకి ఎగబాకింది. అంటే పదకొండేళ్లలో దాదాపు రెండు న్నర రెట్లు పెరిగినట్లు! వంటగ్యాస్ ధర పెంపు భారం గతంలో సామాన్య, మధ్యతరగతి కుటుంబాల పైనే పడేది. ఉజ్వల పథకాన్ని ప్రారంభించిన తర్వాత అది కొంత తగ్గింది. కానీ ఆ వర్గాల ప్రజలపైనా ప్రధాని మోదీ మొట్టమొదటిసారి భారాన్ని మోపారు. ఇప్పటికే గ్యాస్ ధరలు సామాన్యులకు అందనంత స్థాయికి చేరగా, భవిష్యత్తులో మరింత భారం మోపే అవకాశం లేకపోలేదు. ఇప్పటికే దేశంలో పెరుగు తున్న నిత్యావసర వస్తువుల ధరలతో ఇబ్బందిపడుతున్న సాధారణ ప్రజలు.. వంట గ్యాస్ ధరలను అమాంతంగా పెంచటంతో దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. గతంలో ఎదురైన నష్టాలను పూడ్చుకోవటం లో భాగంగా చమురు సంస్థలు వంటగ్యాస్ ధర పెంచాయన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. పెట్రోల్, డీజిల్పై ఎక్సైజ్ సుంకం పెంపు తప్ప వినియోగదారులపై భారం పడదని కేంద్రప్రభుత్వం చెబుతోంది. వాస్తవానికి సాధారణ ఎన్నికలకు ముందు 2024లో కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజీల్పై లీటర్కు రెండు రూపాయల చొప్పున ధర తగ్గించింది. దాంతో మోదీని ఆకాశానికెత్తేశారు. తాజాగా ఎక్సైజ్ సుంకం రూపంలో పెట్రోల్, డీజిల్పై లీటర్కు రెండు రూపాయలు విధించింది. అప్పుడు కోల్పోయిన నష్టాన్ని తాజాగా భర్తీ చేసుకుంది. ఈ పెంపు వల్ల రూ.32 వేల కోట్లు అర్జించబోతుంది. ఎక్సైజ్ సుంకం రూపంలో గతంలో కోట్ల రూపాయలు వెనకేసుకున్న ప్రభుత్వం.. వాటిని పారిశ్రామికవేత్తలకు మేలు చేసిందే తప్ప సామాన్యులకు ఉపయోగపడే చర్యలు శూన్యం. భారత్తో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతికూల ఆర్థిక, వాణిజ్య పరిస్థితుల నేపథ్యంలో మోదీ సర్కారు ధరల పెంపు నిర్ణయం తీసుకుందన్నది వాస్తవం. ఆర్థిక సమస్యలు చుట్టుముట్టినప్పుడల్లా ప్రజలను పక్కదారి పట్టించి ధరలు పెంపు భారాన్ని మోపడం కేంద్రానికి కొత్తేం కాదు. ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకున్నప్పుడల్లా బీజేపీ ప్రభుత్వం మతపరమైన అంశాలను ముందుకుతెచ్చి లబ్ధి పొందుతూ వస్తోంది. పెట్రో ధరల విషయం లో బీజేపీ ప్రభుత్వం అధికార దోపిడీకి పాల్పడుతున్నది. ‘అచ్ఛేదిన్’ ఇప్పుడు కనుచూపు మేరలో కూడా కనిపించడంలేదు. ముడిచమురు ధరలు పెరుగుతుండటం వల్లే భారం వేయాల్సి వస్తుందంటున్న ప్రభు త్వానికి.. అంతర్జాతీయ స్థాయిలో ధరలు తగ్గినప్పుడు ఆ ప్రయోజనాన్ని మాత్రం వినియోగదారులకు అందించడం లేదు. ప్రభుత్వం నిజంగా ప్రజలతో ఉందని భావిస్తే ఇంధన ఉత్పత్తులపై అధిక ఎక్సైజ్ సుంకాలను తగ్గించాలి. అభివృద్ధి ముసుగులో భారం మోపే విధానాలను ప్రజలు నమ్మకపోగా వ్యతిరేకి స్తారు. ధరలు తగ్గించేందుకు పాలకులపై ఒత్తిడి తీసుకురావాలి. ప్రజా ఉద్యమాల్లో భాగస్వాములవ్వాలి.
Comentarios